శ్రీశైలం : అందరి కృషితోనే భ్రమరాంబ మల్లికార్జునస్వామి క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యాయని దేవస్థానం ఈవో లవన్న అన్నారు. గురువారం పరిపాలన భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యేందుకు ప్రతి అధికారి చిత్తశుద్ధితో కృషి చేశారని, ధర్మకర్తల మండలి చైర్మన్తో పాటు సభ్యులు అందరికీ అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు, సిబ్బంది నెల రోజుల నుంచి చేసిన శ్రమ వెలకట్టలేనిదన్నారు.
కలెక్టర్, పోలీస్ అధికారులు ముందస్తు ప్రణాళికలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి సత్ఫలితాలను సాధించడం ప్రశంసనీయమన్నారు. ప్రధానంగా బ్రహ్మోత్సవాలు ఆద్యంతం వెన్నంటే ఉంటూ సమయస్ఫూర్తితో సూచనలిచ్చిన ధర్మకర్తల మండలి చైర్మన్ చక్రపాణి రెడ్డి, సభ్యులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా రాత్రింబగుళ్లు క్షేత్ర పరిధిలో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా కృషి చేసిన ప్రతి కార్మికునికి ప్రత్యేక అభినందనలు చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని అన్నారు.
టోల్గేట్, అకామిడేషన్, లడ్డూ ప్రసాదాలు, టెంపుల్ ఇన్సైడ్ డ్యూటీస్, అన్నదాన విభాగం వారి నిరంతర కృషితోపాటు స్వచ్ఛంద సేవా సంస్థల వారు నిర్వహించిన అన్నదాన శిబిరాలు, శివసేవకుల సేవలు అనిర్వచనీయమని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలను వీక్షించేందుకు ప్రత్యక్ష ప్రసారాలను నిరాటంకంగా ప్రసారం చేసేందుకు శ్రీశైల టీవీ ఛానల్ సిబ్బందితోపాటు టెక్నాలజీ డెవలపర్స్ సరికొత్త విధానాలతో సోషల్ మీడియా ప్రమోషన్స్ ద్వారా భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకోగలిగారని తెలిపారు. సమావేశంలో ఏసీ వెంకటేశ్, పీఆర్వో శ్రీనివాసరావు, ఏఈవో హరిదాసు, ఫణీంద్రప్రసాద్, డీ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.