అమరావతి : విశాఖ-తూర్పుగోదావరి సరిహద్దులోని కొయ్యూరు మండలం తీగమెట్ట వద్ద ఈ తెల్లవారుజామున గ్రేహాండ్స్ దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఎవరు చనిపోయారు, ఎంతమందికి గాయాలయ్యాయి తదితర వివరాలు సేకరించడంలో ఆలస్యమవుతున్నదని పోలీసులు చెబుతున్నారు. కాల్పుల్లో చాలామంది నక్సల్స్కు, పోలీసులకు సైతం గాయాలైనట్లు తెలిసింది. ఘటనాస్థలంలో ఏకే-47 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలానికి పోలీసుశాఖ అదనపు బలగాలను పంపుతున్నట్లు వినికిడి. మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నారన్న సమాచారం మేరకు పోలీసులు అటవీ ప్రాంతాన్ని గాలిస్తున్నారు. కొయ్యూరు మండలం మంప పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున గ్రేహాండ్స్ దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా తీగమెట్ట వద్ద మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు జరిగాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.