అమరావతి : ఉద్యోగులకు (Employees ) చెల్లించాల్సిన బకాయిలను రాష్ట ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఆందోళన నిర్వహించారు. గుంటూరులో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్రావు (Bandi Srinivas Rao) మాట్లాడుతూ 12వ పీఆర్సీ (PRC) , ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన బకాయిలే ప్రభుత్వాన్ని అడుగుతున్నామని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క డీఏ ఇచ్చిన దాఖలాలు లేవని ఆరోపించారు. ఉద్యోగులకు రావాల్సిన 26వేల కోట్ల రూపాయలను ఇవ్వడం లేదని మండిపడ్డారు. జీతాలను సకాలంలో ఇవ్వకుండా ఉద్యోగులను ఇబ్బందులపాలు చేస్తుందని అన్నారు. గత్యంతరం లేని పరిస్థితిల్లో ఉద్యోగులు ఆందోళన చేపడుతున్నారని ఆయన వెల్లడించారు.