AP News | ఏపీలో ఈ-ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియ వాయిదా పడింది. గ్రామ, వార్డు సచివాలయాలకు ఈ-ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియను నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. దీనిపై ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఈవో ముకేశ్కుమార్ మీనాకు చంద్రబాబు లేఖలు రాశారు.
చంద్రబాబు ఫిర్యాదు నేపథ్యంలో ఎన్ఐసీ ప్రతినిధులతో సీఈవో ముకేశ్ కుమార్ మీనా సమావేశమయ్యారు. ఈ-ఆఫీస్ ప్రక్రియ అప్గ్రేడేషన్పై ఆరా తీశారు. అనంతరం అప్గ్రేడేషన్ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న ఈ ఆఫీస్ వెర్షన్తోనే విధులు నిర్వహించాలని హెచ్వోడీలను ప్రభుత్వం ఆదేశించింది.