Srisailam | పర్యావరణ పరిరక్షణతో పాటు క్షేత్రాన్ని సుందరీకరించేందుకు క్షేత్ర పరిధిలో విస్తృతంగా మొక్కలు నాటుతున్నట్లు ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. క్షేత్రంలో మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు 30శాతం దేవతా మొక్కలను నాటడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా గురువారం బ్రామరీ పుష్పవనంలో బిల్వమొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఇప్పటికే బ్రామరీ పుష్పవనంలో మహాబిల్వం మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 2వేల బిల్వ మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. ఈ మొక్కలను విరాళంగా నెల్లూరుకు చెందిన ఎన్డీఆర్ గ్రూప్ చైర్మన్ ఎన్ ఆదికేశవులు రెడ్డి అందజేశారన్నారు. ఈ వర్షాకాలం సీజన్ ముగిసేలోగా కనీసం 5వేల మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.
ఇప్పటికే పలుచోట్ల సుమారు 3వేల మొక్కలను నాటినట్లు తెలిపారు. పలుచోట్ల దేవతా వృక్షాలు, నీడనిచ్చే మొక్కలు, ఉద్యానవనాల్లో పూలమొక్కలు, సుందరీకరణ మొక్కలు నాటేవిధంగా సమగ్ర విధానాన్ని రూపొందించామన్నారు. దేవతా వృక్షాలలో బిల్వం, కదంబం, రుద్రాక్ష, తెల్లమద్ది, ఉసిరి, రావి, మేడి, వేప మొదలైన వృక్షాలు నాటుతున్నట్లు వివరించారు. పార్కింగ్ ప్రదేశాలు, ఆరుబయట ప్రదేశాలు నీడనిచ్చే చెట్లు నాటేలా ఏర్పాటు చేశామన్నారు. వలయ రహదారికి ఇరువైపులా కూడా మరిన్ని మొక్కలు నాటిస్తామన్నారు. నాటిన మొక్కలను సంరక్షించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికాలను ఆదేశించారు. మొక్కలు నీటిని పోయడంతో పాటు వాటికి ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఆదికేశవులురెడ్డి మాట్లాడుతూ స్వామివారి నిత్యకైంకర్యానికి వినియోగించుకునేందుకు వీలుగా 2వేల బిల్వం మొక్కలను దేవస్థానానికి విరాళంగా అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉద్యానవన అధికారి ఎస్ లోకేశ్, సిబ్బంది పాల్గొన్నారు.