అమరావతి : విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో భవానీ భక్తులు అమ్మవారి దర్శనాలకే రావాలని, మాల వితరణకు అవకాశం లేదని ఆలయ ఈవో భ్రమరాంబ అన్నారు . ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. ఈనెల 26 నుంచి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా మొదలవుతాయని తెలిపారు. పదిరోజుల పాటు కొనసాగే ఉత్సవాలు పది అలంకారాల్లో అమ్మవారు దర్శనం ఉంటుందని వివరించారు.
మూలా నక్షత్రం రోజు ఏపీ సీఎం జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వివరించారు. దసరా మహోత్సవాలకు టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. ఘాట్రోడ్డులో క్యూలైన్ల ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయని ఆమె వెల్లడించారు. ఈ ఏడాది కూడా అంతరాలయ దర్శనాలు లేవని స్పష్టం చేశారు. కరోనా తగ్గడంతో పది లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని ప్రకటించారు.
యథావిధిగా రూ. 100, రూ. 300, ఉచిత దర్శనాలు ఉంటాయన్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే వీఐపీ వ్యక్తులకు బ్రేక్ దర్శనంపై సమన్వయ కమిటీలో తుది నిర్ణయం తీసుకుంటామని ఈవో తెలిపారు. గతంలో మాదిరిగానే నగరోత్సవం నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు.