Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో దసరా నవరాత్రులు వైభవంగా ముగిశాయి. దేవీ నవరాత్రుల్లో పది రోజులు వివిధ అలంకారాలలో దర్శనమిచ్చిన శ్రీశైల శ్రీ భ్రమరాంబదేవి చివరి రోజూ నిజరూప అలంకాంరంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మెన్ చక్రపాణిరెడ్డి, ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు షోడశోపచార క్రతువుల్లో భాగంగా మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, చండీయాగం, రుద్రయాగం పూర్ణాహుతి, తిశూలస్నానం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం వేదపండితులు చతుర్వేద పారాయణంతో వేదనీరాజనం చేశారు.
సాయంత్రం అలంకార మండపంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహంచారు. అటుపై నందివాహన సేవలో ఆలయ ప్రాకారోత్సవం ఘనంగా జరిపించారు. ప్రధానాలయంలో ఈశాన్య ప్రాంతంలో ఉండే శమీ వృక్షం వద్ద సంప్రదాయ పూజలు చేశారు.
శమీపూజలో పాల్గొనడంతో కష్టాలు నశించి సకలు శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసించి శమీపత్రాలను ప్రసాదంగా స్వీకరించారని ప్రధాన అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో ఈవో పెద్ది రాజుతో పాటు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఈఈ రామకృష్ణ, ఏసి వెంకటేశ్వర్లు ఏఈవోలు ఫణిధర్ ప్రసాద్, మోహన్, హరిదాస్ తదితరులు పాల్గొన్నారు.
దసరా మహోత్సవాలలో భాగంగా ఆఖరిరోజు రాత్రి ప్రాకారోత్సవం తర్వాత స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రధాన గోపురం గుండా లయ పుష్కరిణి వద్ద ప్రత్యేకాలంకరణ చేసిన తెప్పపై ఆసీనులజేసి పుష్పార్చన చేశారు. ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో జరిగిన తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు, మ్యూజికల్ ఎఫెక్ట్ ఎల్ఈడీ, సౌండ్సిస్టమ్తో పుష్కరిణిలో విహరించే శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.