తిరుమల: రెండేండ్ల అనంతరం జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలకు రంగం సిద్ధమైంది. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ ట్రస్ట్ బోర్డ్ కీలక నిర్ణయిం తీసుకున్నది. బ్రహ్మోత్సవాల సమయంలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తామని, అన్ని రకాల ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేసినట్లు ట్రస్ట్ బోర్డు వెల్లడించింది.
తిరుమల మాడ వీధుల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపడుతున్నది. కరోనా కారణంగా గత రెండు బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా జరిగాయి. కాగా, ప్రస్తుతం జరిపే బ్రహ్మోత్సవాలకు విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉండటంతో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. అన్నిరకాల ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు చేసింది.
బ్రహ్మోత్సవాల రోజుల్లో ఎక్కువ మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐపీ బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేశారు. ఆర్జిత సేవలు, రూ.300/- దర్శన టికెట్లతోపాటు శ్రీవాణి ట్రస్టు దాతలు, ఇతర ట్రస్టుల దాతలకు దర్శన టికెట్లు రద్దు చేశారు. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది.
గదులకు సంబంధించి 50 శాతం ఆన్లైన్లో భక్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా గదులు అందుబాటులో ఉంచారు. మిగిలిన గదులను ఆఫ్లైన్లో తిరుమలలోని వివిధ కౌంటర్ల ద్వారా భక్తులకు కేటాయిస్తారు. అక్టోబరు 1న గరుడసేవ కారణంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రస్టుల దాతలు, కాటేజీ దాతలకు సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో గదుల కేటాయింపు ఉండదు. దాతలు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ ట్రస్ట్ బోర్డు విజ్ఞప్తిచేసింది.
అలాగే, ఎంతో పవిత్రంగా భావించే పెరటాసి మాసంలో బ్రహ్మోత్సవాలు రానుండటంతో పెద్దసంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉన్నదని, తిరుమలలో గదుల లభ్యత పరిమితంగా ఉన్న కారణంగా ఈ విషయాన్ని గమనించి భక్తులు తిరుపతి పట్టణంలో గదులు పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.