అమరావతి : తెలంగాణ, ఏపీలో కురుస్తున్న వర్షాల వల్ల గోదావరి నది ( Godavari River) కి వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతుంది . దీంతో కోనసీమ జిల్లాలతో పాటు నది ప్రవాహ ప్రాంతంలో ఉన్న మండలాలకు వరద నీరు వచ్చి చేరుతుంది . ఈ కారణంగా పాపికొండల విహారయాత్రను( Papikondalu Tour Cancell) పర్యాటక శాఖ అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు.
కోనసీమ జిల్లా గోదావరి నది పాయలో పెరిగిన వరద ప్రవాహంతో పి.గన్నవరం మండలం బూరుగులంక రేవులో తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. దీంతో బూరుగులంక, ఊడిమూడిలంక, అరిగెలవారిపేట, జిపెద్దపూడిలంక ప్రాంతాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. గ్రామస్థులు పడవలతో రాకపోకలు సాగిస్తున్నారు.
ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో ఎదువాగు వంతెన నీట మునిగింది. 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అల్లూరి జిల్లాలో భారీ వర్షాల చింతూరు-వరరామచంద్రపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు వద్ద ఉన్న శబరి నీటిమట్టం 29.5 అడుగులకు చేరుకుంది. కొండరాజపేట వద్ద రహదారిపై వరద నీరు చేరడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు.