అమరావతి : కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి గుట్టు రట్టయ్యింది. ప్రమాదంలో కాదు హత్య చేశారని పోస్టుమార్టం నివేదిక తేల్చిచెప్పింది. అతడిని బీచ్లో చంపి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసింది. మృతుడి బట్టలపై బీచ్లో మట్టి, ఇసుక, ఒంటిపై కాళ్లతో తన్నిన గుర్తులను వైద్యులు గుర్తించారు. తల మీద గాయం, ఎడమ చేయి, పై పెదవి మీద కూడా గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఎడమ కాలు బొటన వేలు, కుడికాలు మడెం దగ్గర గాయాలు ఉన్నట్లు వైద్యులు తమ నివేదికలో వెల్లడించారు.
కాకినాడలో మూడు రోజుల కిందట మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు. ఎమ్మెల్సీ మధ్య రాత్రి సుబ్రహ్మణ్యం మృతదేహంతో వచ్చి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని తన సొంత కారులో మృతదేహం ఉందని తీసుకోవాలని బలవంతం చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ నిరాకరించడంతో ఎమ్మెల్సీ తన సొంతకారును అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఎమ్మెల్సీ వ్యవహారాన్ని ప్రశ్నిస్తూ కుటుంబ సభ్యులు చేసిన ఆందోళనకు ప్రజా సంఘాలు, వామపక్షాలు, టీడీపీ నాయకులు మద్దతు తెలుపడంతో పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకుంది.
చివరకు నిన్న అధికారుల హామీ మేరకు కుటుంబ సభ్యులు పోస్టుమార్టంకు అంగీకరించడంతో వైద్యులు నిర్వహించిన పోస్టుమార్టంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుబ్రహ్మణ్యంను కొట్టి చంపారని పోస్టుమార్టంకు నివేదిక తేల్చి చెప్పడంతో కాకినాడలో టెన్షన్ నెలకొంది.