Srisailam | భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పర్యటనకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని నంద్యాల జిల్లా ఎస్పీ కే రఘువీర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన జాయింట్ కలెక్టర్ టీ నిశాంతిలతో కలిసి ఎఎస్ఎల్ ట్రయల్ రన్ నిర్వహించారు. ద్రౌపది ముర్ము పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తూ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 26న శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సున్నిపెంట హెలిప్యాడ్ వద్ద మూడు హెలికాప్టర్లు ల్యాండ్ కావడంతోపాటు అక్కడి బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ రఘువీర్ రెడ్డి పరిశీలించారు. హెలిప్యాడ్ లోని గ్రీన్ రూము, సేఫ్ రూమ్, విజిటర్స్ రూములను పరిశీలించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో విధులు నిర్వర్తించే సిబ్బంది ప్రతి ఒక్కరూ డ్యూటీ పాస్ ధరించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ తమ డ్యూటీ వద్ద అప్రమత్తంగా వ్యవహరిస్తూ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవాలన్నారు. నల్లమల అడవులలో గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ బలగాలతో కూంబింగ్ నిర్వహించాలని ఆదేశించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన బందోబస్తు ఏర్పాట్లపై జరిగిన సమావేశంలో కర్నూలు రేంజ్ డీఐజీ శ్రీ ఎస్ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సున్నిపెంట హెలిపాడ్ వద్ద నుండి భ్రమరాంబిక గెస్ట్ హౌస్, టెంపుల్ ,టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్ ,శివాజీ స్ఫూర్తి కేంద్రం తదితర ప్రాంతాలలో పర్యటించి తిరిగి హెలిపాడ్ వద్దకు చేరుకునే వరకు తీసుకున్న బందోబస్తు చర్యలపై అధికారులను అడిగి తెలుసుకుని తగు సూచనలు చేశారు.
విధులు నిర్వహించే వివిధ శాఖల అధికారులు,వారి సిబ్బంది పోలీసు యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ రఘువీర్ రెడ్డి కోరారు. నియమితులైన అధికారులు, సిబ్బంది ముందుగానే సంబంధిత ప్రదేశాలకు చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐపీఎస్ అధికారి విక్రాంత్ పటేల్, నంద్యాల అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆర్ రమణ, ఆత్మకూరు డీఎస్పీ శ్రీమతి వై శృతి తదితరులు పాల్గొన్నారు.