అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) చురకలు వేశారు. కుటంబాలను విచ్ఛినం చేసే వ్యక్తి సీఎం జగన్(CM Jagan) రాష్ట్రంలో వివిధ కులాలు కొట్టుకోవాలన్నదే అతడి నైజమని ఆరోపించారు. భీమవరంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. సమాజానికి ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుందని, జగన్ విష సంస్కృతి అతడి ఇంట్లోనే వచ్చిందని విమర్శించారు.
సమాజాన్ని కలిపేవారిని జనం గుర్తు పెట్టుకుంటారని, అందుకు పొట్టి శ్రీరాములు( Potti Sriramulu) , అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) తదితర నాయకుల పేర్లను ఉదహరించారు. సొంత చెల్లెలుకే ఆస్తి ఇవ్వని వ్యక్తి మనకేం చేస్తారని నిలదీశారు. వైసీపీ సిద్ధమంటే తాము యుద్ధమంటామని అన్నారు. యుద్ధం చేసేంత గొప్పవాడు జగన్ కాదని ఎద్దేవా చేశారు. అప్పులు చేసి బటన్ నొక్కడం కాదు. అభివృద్ధి చేసి బటన్ నొక్కితే సలాం కొడతానని అన్నారు.
టీడీపీ, జనసేన వస్తే పథకాలు ఆపేస్తారని వైఎస్ జగన్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొన్నారు. ఏపీలో జరిగిన గత ఎన్నికల్లో ఓడిపోయాక మరింత బలపడ్డామని పేర్కొన్నారు. తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని రక్షించాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. రాబోయే రోజుల్లో డబ్బులతో ఓట్లను కొనుగోలు చేసే అవసరం లేని రాజకీయాలు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.