తిరుమల : ముంబైకి చెందిన విష్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లిమిటెడ్ సంస్థ టీటీడీకి రూ.5 కోట్ల విలువైన 800 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే గాలిమరను (Windmill) విరాళంగా(Donation) అందజేసింది. తిరుమల జీఎన్సీ ప్రాంతంలో గాలిమర ఏర్పాట్లను టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు.
ఏపీఎస్ఈబీ నుంచి అనుమతులు వచ్చిన తరువాత టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ విద్యుత్ గాలిమర ద్వారా సంవత్సరానికి 18 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, దీని వల్ల ప్రతి ఏడాది టీటీడీకి రూ.కోటి ఆదా అవుతుందని ఈవో తెలిపారు.
ఇప్పటికే టీటీడీ అవసరాలకు 15 సంవత్సరాల క్రితమే ఈ కంపెనీ 1.03 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే రెండు గాలి మర్లను ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణ బాధ్యతను కంపెనీ వారే చూసుకుంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో జేఈవో సదా భార్గవి, సీఈ నాగేశ్వరరావు, ఎస్ ఈ -2 జగదీశ్వర్ రెడ్డి, డీఈ ఎలక్ట్రికల్ రవిశంకర్ రెడ్డి, ఈఈలు సురేంద్ర నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, కంపెనీ ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.