తిరుపతి : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి హైదరాబాద్కు చెందిన భక్తుడు సత్య నారాయణ స్వర్ణ పాదాలు విరాళంగా సమర్పించారు. ఆలయంలో జరిగే కల్యాణోత్సవంలో వేంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తికి అలంకరించేందుకు ఈ పాదాలను అందించారు. 85 గ్రాముల బరువుగల ఈ పాదాల విలువ రూ.4 లక్షలు అని భక్తుడు తెలిపారు. ఈ స్వర్ణపాదాలను ఆలయంలో ఏఈవో ప్రభాకర్రెడ్డి, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ శేషగిరికి భక్తుడు అందజేశారు.
కాగా సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబరు 5వ తేదీ విజయ దశమినాడు శ్రీపద్మావతి అమ్మవారు విశేషమైన గజ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారని వెల్లడించారు.
ఆర్జిత సేవలు రద్దు
నవరాత్రి ఉత్సవాల కారణంగా ఈ 10 రోజుల పాటు కల్యాణోత్సవం, సహస్రదీపాలంకార సేవలను,సెప్టెంబరు 30న లక్ష్మీపూజ, అక్టోబరు 5న అష్టోత్తర శత కలశాభిషేకం సేవలు రద్దు చేస్తున్నట్లు వివరించారు.