అమరావతి : ఏపీలో జిల్లాల పునర్విభజన విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఒత్తిళ్లకు లొంగబోరని పీఆర్సీ సాధన సమితి నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాస రావు స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలో ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యోగుల ఉద్యమం సమయంలోనే ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చిందని వారు ఆరోపించారు. జిల్లాల పునర్విభజనపై మేం చేయగలిగినంత వరకు చేస్తామని అయితే పునర్విభజన విషయంలో తమపై ఒత్తిళ్లు తీసుకురావద్దని కలెక్టర్లను కోరుతున్నామని వారు కోరారు. ఈ విషయంలో అధికారుల ఒత్తిళ్లకు లొంగబోమని స్పష్టం చేశారు.
ప్రభుత్వం 11వ పీఆర్సీపై మొండివైఖరిని అలవంభిస్తుందని ఆరోపించారు. ఈనెల జీతం రాకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని , ఉద్యోగుల జీతాలు ఆపితే ఊరుకునేది లేదని పేర్కొన్నారు. పీఆర్సీ అంటే వేతనాలు పెరగాలి..కానీ తగ్గాయని వివరించారు. ఆరునూరైన పీఆర్సీపై వెనుక అడుగు వేయబోమని వారు స్పష్టం చేశారు. అవసరమైన సందర్భంలో ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొనాలని కోరుతామని వారు తెలిపారు.