అమరావతి : తెలుగుదేశం పార్టీకి సీనియర్ నేత దివ్యవాణి షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి ప్రకటించారు. పార్టీలో దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇంతవరకు తనను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. మహానాడులో అవమానం జరిగినట్లు రెండు రోజుల కిందట ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ మహానాడులో తనకు ఘోర అవమానం జరిగిందని.. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని దివ్యవాణి ఆరోపించారు. పార్టీకి నిస్వార్థంగా సేవ చేస్తున్నా గుర్తింపే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ కళాకారుడు (దివంగత ఎన్టీఆర్) పెట్టిన పార్టీలో కళాకారులకు స్థానం లేకపోవడం తనని ఆవేదనకు గురి చేస్తోందన్నారు. ఈ క్రమంలో మంగళవారం దివ్యవాణి అనూహ్యంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఆమె అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.