అమరావతి : విశాఖపట్నం జిల్లాలో కరోనా విజృంభిస్తుంది. గడిచిన 11 రోజులుగా జిల్లాలో పెరుగుతున్న కేసుల సంఖ్యతో జిల్లావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 1న 1. 95 శాతం ఉన్న పాజిటివిటి రేటు అమాంతం 11శాతానికి పెరగడం ఆందోళన కలిగించే అంశమని వైద్యవర్గాలు భావిస్తున్నాయి.
ఈనెల 1న జిల్లాలో 40మందికి, 2న 35 మందికి, 3న 41 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 4న 80 మంది, 5న 63 మంది, 6న 89 మంది కొవిడ్ బారిన పడ్డారు. 7న 185 మంది, 8న 174 మంది, 9న 196 మందికి కరోనా సోకింది . 10న 151కి సోకగా, 11న 295 మందికి కరోనా బారిన పడ్డారు. జిల్లాలో ఇప్పటి వరకు లక్షా 60,774 మంది కరోనా బారిన పడగా లక్షా 58,352 మంది కోలుకున్నారు. కరోనాతో 1,112 మంది మృత్యువాత పడ్డారని వైద్యవర్గాలు వెల్లడించాయి. ఇటీవల కాలంలో పెరుగుతున్న కేసులతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను కఠినతరం చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది.
సంక్రాంతి పండుగ సందర్భంగా ముందుగా ప్రకటించిన విధంగా కాకుండా నైట్కర్ఫ్యూను ఈనెల 18 నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. అయితే మిగతా సమయాల్లో ప్రజలందరూ మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించింది.