అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల పవిత్రతను ఒక పక్కా ప్రణాళికతో దెబ్బతీస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. వెంకన్న సన్నిధిని నిత్య వివాదాల కేంద్రంగా మార్చేశారని ఇవాళ ట్విటర్ వేదిక ద్వారా విమర్శించారు. ఏపీ సీఎం జగన్ భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే నిర్ణయాలు తీసుకుని అనేక ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు.
స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడు తనకు గది కేటాయించడం లేదంటూ టీటీడీ సీనియర్ అసిస్టెంట్ వెంకటరత్నంపై దుర్భాషలాడుతూ భౌతిక దాడి చేయడాన్ని ఖండించారు. భక్తులకు, సిబ్బందికి రక్షణ కల్పించ లేకపోవడం టీటీడీ, ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. టీటీడీ సిబ్బందిపై దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరులపై కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను కోరారు.