తిరుపతి : అలిపిరి నడక మార్గంలో చిరుత(Leopard) దాడిలో గాయపడిన చిన్నారి కౌశిక్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో అతడిని శుక్రవారం వైద్యులు డిశ్చార్జి చేశారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన బి.పులికొండ, బి.శిరీష దంపతులు జూన్ 22న రాత్రి కాలినడకన అలిపిరి మెట్ల నుంచి వెళ్తుండగా మాటు వేసిన చిరుత దాడి చేసి నోట కరుచుకుపోయింది. సకాలంలో బాలుడి కుటుంబ, అటవి సిబ్బంది స్పందించి చిరుతను వెంబడించగా బాలుడిని వదిలేసి పారిపోయింది . బాలుడికి గాయాలు కావడంతో తిరుపతి ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి(YV Subbareddy) బాలుడి కుటుంబ సభ్యులను శుక్రవారం పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ బాలుడిని శ్రీవారే రక్షించారని , 14 రోజుల చికిత్స అనంతరం పూర్తి ఆరోగ్యంతో ఉన్న చిన్నారిని వైద్యులు డిశ్చార్జి చేశారని తెలిపారు. జూన్ 22న రాత్రి చిన్నారిపై చిరుత దాడి జరిగిందని, టీటీడీ (TTD)అధికారులు వెంటనే స్పందించి శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారని చెప్పారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో బాలుడికి చికిత్స జరిగిందని వివరించారు.
ప్రస్తుతం బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. అటవీ శాఖ సహకారంతో చిరుతను బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టామని చెప్పారు. నడకమార్గాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారని తెలియజేశారు. బాలుడి తల్లిదండ్రులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దయతోనే తమ బిడ్డ ప్రాణాలతో దక్కాడని సంతోషం వ్యక్తం చేశారు . స్వామి వారికి తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.