అమరావతి: తిరుపతి, తిరుమల దేవస్థానం (టీటీడీ) ఎగ్జిక్యూటీవ్ అధికారిగా ఏవీ ధర్మారెడ్డిని నియమించడంపై ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. పిల్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఈఓగా వ్యవహరిస్తున్న ధర్మారెడ్డితోపాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి జవహర్రెడ్డి బదిలీతో టీటీడీ ఈఓ పదవి ఖాళీ అయింది. ఈ పదవిని అక్కడే అదనపు ఈఓగా ఉన్న ధర్మారెడ్డితో భర్తీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు ధర్మారెడ్డి డిప్యుటేషన్ కాలాన్ని రెండేండ్లకు ప్రభుత్వం పెంచింది. ఐడీఈఎస్కు చెందిన ధర్మారెడ్డి పదవీ కాలం గత నెల 14 న ముగియగా.. ఆయన సేవలు రాష్ట్రానికి అవసరమైనందున ఇక్కడే కొనసాగించాలంటూ ఏపీ సర్కార్.. కేంద్రానికి లేఖ రాసి గ్రీన్ సిగ్నల్ పొందింది.
దేవాదాయ శాఖ చట్టంలో పేర్కొన్న విధంగా టీటీడీ ఈఓగా కలెక్టర్ లేదా ఆ ర్యాంకు అధికారిని నియమించాల్సి ఉండగా.. ఇతర క్యాడర్ వారిని ఎలా నియమిస్తారంటూ తిరుపతికి చెందిన నవీన్ కుమార్రెడ్డి ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. నిర్దిష్టమైన అర్హతలు లేని ధర్మారెడ్డి టీటీడీ ఈఓ పదవిని చేపట్టడం చట్టవిరుద్ధమని తన పిల్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పిల్ కిందకా లేదా సర్వీస్ నియామకం వివాదం కిందికి వస్తుందా అన్నా సందేహాన్ని కోర్టు వ్యక్తం చేసింది. మరింత స్పష్టత ఇవ్వాలని కోర్టు కోరగా.. ఓ భక్తుడిగా పిల్ దాఖలు చేసినట్లు పిటిషనర్ విన్నవించారు. సర్వీస్ నిబంధనల గురించి తాము ప్రశ్నించడం లేదని, దేవాదాయ శాఖ చట్టం నిబంధనల అమలు గురించే ప్రశ్నిస్తున్నామని కోర్టుకు తెలిపారు. దాంతో పిల్ను విచారణకు స్వీకరించి ధర్మారెడ్డితోపాటు కేంద్ర హోంశాఖ, సిబ్బంది-శిక్షణ వ్యవహారాల శాఖ, ఏపీ సీఎస్, ఏపీ జీఏడీ ముఖ్యకార్యదర్శి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ బోర్డు కమిటీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.