అమరావతి: తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తిరుమల చెంతకు చేరుకున్నారు. కొవిడ్ అనంతరం ఇంత పెద్ద సంఖ్యలో తిరుమలకు రావడం ఇదే తొలిసారి. రెండో శనివారం, ఆదివారం సెలవు దినాల కారణంగా దేశంలోని నలుమూలల నుంచి భక్తులు ఆలయానికి వివిధ మార్గాల ద్వారా తిరుమలకు చేరుకున్నారు. నిన్న ఒక్కరోజే 75,775 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
36,474 మంది భక్తులు తలనీలాలు సమర్పించు కున్నారు. కానుకల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.7కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్ల డించారు. కాగా ఈరోజు నుంచి ఐదురోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
కరోనా కారణంగా ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులకు అనుమతి లేదని వెల్లడించిన అధికారులు కొవిడ్ తగ్గిన కారణంగా భక్తులు పాల్గొనేందుకు అనుమతినిస్తున్నట్లు ప్రకటించారు . నేడు శ్రీరాముని అవతారంలో తెప్పలపై స్వామి వారు విహరించనున్నారు.