Tirumala Rain | తిరుమల, తిరుపతిలో గురువారం భారీ వర్షం కురిసింది. వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత కూడా పెరిగింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లపై వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు హితవు చెప్పారు. కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో సిబ్బంది అప్రమత్తం అయ్యారు. పాప వినాశనం, శ్రీవారి పదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. గో గర్భం, పాప వినాశం పూర్తిగా నిండిపోయి బయటకు నీరు ఔట్ ఫ్లో అవుతున్నది.
భారీగా కురిసిన వర్షం వల్ల తిరుపతి వీధులు జలమయం అయ్యాయి. గొల్లవానిగుంట, లక్ష్మీపురం కూడలి తదితర లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ప్రవహిస్తున్నది. వెస్ట్ చర్చి చౌరస్తాలోని రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతం వర్షపు నీటితో నిండిపోవడంతో అధికారులు వాహనాలను దారి మళ్లించారు.