విజయవాడ: మంత్రి కొడాలి నానిపై మాజీ మంత్రి దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. కొడాలి నానిపై తీవ్రమైన పదజాలం వాడారు. మరోసారి ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తుండటంతో ఆ ప్రాంత ప్రజలు ఏం జరుగుతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బూతుల మంత్రి తన వ్యవహారంతో కృష్ణా జిల్లా పరువు తీస్తున్నాడని దేవినేని ఉమ దుయ్యబట్టారు. చంద్రబాబు రాజకీయంగా బిక్ష పెట్టడం వల్లనే ఈ స్థాయికి వచ్చిన విషయాన్ని కొడాలి నాని మరిచిపోవద్దన్నారు. చంద్రబాబుపై మంత్రి నాని తీవ్రంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దేవినేని ఉమ ఘాటుగా స్పందించారు.
ఎమ్మెల్సీ అశోక్బాబు అరెస్ట్తో మరోసారి వైసీపీ, టీడీపీ మధ్య మరోసారి మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకప్పుడు చంద్రబాబు కాళ్లు పట్టుకొని ఉద్యోగం తెచ్చుకున్న ఆయన… ఇప్పుడు జగన్ కాళ్లు పట్టుకుంటున్నారంటూ ఘాటుగా కామెంట్ చేశారు. సన్న బియ్యం ఇప్పించే స్థాయిలో లేని వారు కూడా మాట్లాడుతుంటే బాధగా ఉందన్నారు. అంకుశం సినిమాలో రామిరెడ్డి పాత్రకు పట్టిన గతే.. ఈయనకు కూడా పడుతుందని హెచ్చరించారు. కచ్చితంగా నాని పొగరు అణిచేస్తామని చెప్పారు.
జిల్లాల గురించి, ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత కొడాలి నానికి లేదని దేవినేని ఉమ అన్నారు. ఆయన మాట్లాడుతున్న భాష విని బయటి ప్రాంతంలోని వారు ఆయన్ను పశువులా చూస్తున్నారన్నారు. కేసులు పెడితే భయపడతామనుకున్నావా? అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? చంద్రబాబు వయసెంత? నీ వయసెంత? అని దేవినేని ఉమ కొడాలి నానిపై ఫైర్ అయ్యారు.