విజయవాడ: మేకపాటి గౌతమ్రెడ్డి సంగం ప్రాజెక్టును ప్రారంభించిన తీరుపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులను తాము చేపడుతున్నట్లుగా వైఎస్ జగన్ సర్కార్ గొప్పలకు పోవడాన్ని దేవినేని ఉమ తీవ్రంగా ఆక్షేపించారు. కేవలం ప్రాజెక్టుల పేర్లు మార్చారే గానీ ఏ ఒక్క ప్రాజెక్టునైనా మీ ప్రభుత్వం కట్టిందా? అని ట్విట్టర్ వేదికగా ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రాజెక్టులను జగన్ ప్రారంభిస్తున్నారని దేవినేని ఉమ విమర్శించారు. ప్రాజెక్టుల నిర్వహణ, నిర్మాణాలను ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తుందని ఆయన విచారం వ్యక్తం చేశారు. సంగం బరాజ్ పనులను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యేక దృష్టి సారించి 82 శాతానికి పైగా పూర్తి చేశారని తెలిపారు. నెల్లూరు జిల్లాలో సాగు, తాగు నీటి అవసరాలను తీర్చాలన్న దూరదృష్టితో చంద్రబాబు సంగం బరాజ్ నిర్మాణానికి పూనుకున్న విషయం మర్చిపోయి వైసీపీ నేతలు మాట్లాడటం తగదన్నారు.
వైసీపీ ప్రభుత్వం గడిచిన 40 నెలల కాలంలో 10 శాతం పనులు కూడా చేయకుండా రిబ్బన్ కటింగ్ చేశారని దేవినేని ఉమ సెటైర్ వేశారు. సంగం బరాజ్ పేరును మార్చడం తప్ప ఏం చేశారని నిలదీశారు. ఎవరి హయాంలో ఎంత ఖర్చు పెట్టారో చెప్పే ధైర్యం సీఎం జగన్కు ఉందా? అని దేవినేని ఉమ సవాల్ విసిరారు. ప్రజల అవసరాలను తీర్చకుండా ప్రభుత్వం కేవలం ప్రారంభోత్సవాలకే పరిమితమై పోయిందని విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏ ఒక్క కొత్త ప్రాజెక్టు చేపట్టారో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.