విజయవాడ: చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. నువ్వు, నీ సీఎం జగన్లే 420 లు, అలాంటిది చంద్రబాబును 420 అని వ్యాఖ్యానించడానికి ఎంత ధైర్యం అంటూ కొడాలి నానిపై ఒంటికాలితో లేచారు. మంత్రి పదవి కోసం జగన్ బూట్లు నాకే నీకు.. చంద్రబాబును విమర్శించే స్థాయి లేదు అని చెప్పారు. తెలుగు యువత అధ్యక్షుడిగా చేసిన రావి శోభనాద్రీశ్వరరావును, ఆయన కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచిన విషయాన్నే మరిచిపోయావా? అని ప్రశ్నించారు. అలాగే, నారా లోకేశ్ పెండ్లికి వాళ్ల ఇంటి ముందు తాటాకు పందిరి వేసింది మర్చిపోయినట్లువ్.. అందుకే నీ గతం ఇది అని గుర్తుచేస్తున్నా అంటూ మండిపడ్డారు.
క్యాబినెట్ మంత్రిగా ఉంటూ క్యాసినో ఆడించిన కొడాలి నానిని తక్షణమే మంత్రిమండలి నుంచి తొలగించాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. లక్షల టన్నుల ధాన్యాన్ని కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా తరలించి దోచుకుంటున్నారని ఆరోపించారు. కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న ధాన్యం ఎగుమతులపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. వైఎస్ వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పిన ఎంపీ విజయసాయిని కూడా సీబీఐ విచారించాలని దేవినేని డిమాండ్ చేశారు.