Srisailam | భక్తుల సౌకర్యార్థం శ్రీశైల మహా క్షేత్రంలో దేవస్థానం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అభివృద్ధి పనులు చేపట్టిన పలు ప్రాంతాల్లో ఆయా పనుల పురోగతిని బుధవారం దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి (ఈఓ) పెద్దిరాజు పరిశీలించారు. రోడ్లు భవనాల అతిథి గృహ కూడలి, సిద్దిరామప్ప కొలను ప్రాంతం, మల్లికార్జునసదన్ కూడలి తదితర ప్రాంతాలను పరిశీలించారు.
కాగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం వద్ద రహదారిని ఇరువైపులా విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. అలాగే ట్రాఫిక్ సమస్యలు అధిగమించేందుకు రాజుల సత్రం కూడలి నుంచి సిద్ధిరామప్ప పాదాల వరకు (కొండలోయకు ఇటునుండి అటువైపు) బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు.
ఇంకా ట్రాఫిక్ సమస్యలు అధిగమించడంలో భాగంగానే మల్లికార్జునసదన్ నుంచి టోల్ గేట్ మీదుగా రామయ్య టర్నింగ్ వరకు ఫ్లై ఓవర్ నిర్మాణ ప్రతిపాదనను దేవస్థానం సిద్ధం చేస్తున్నది. ఈ మేరకు మంగళవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ పనుల ప్రతిపాదనలను ఆమోదించారు.