అమరావతి : ఏపీలో పదేండ్ల పాటు పరిపాలన చేసిన టీడీపీ, వైసీపీతో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. కర్నూలు జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను (Projects) పూర్తి చేయక ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఒక్క అవకాశమంటూ అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్( YS Jagan) మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఒక్క పనిని పూర్తి చేయలేక పోయారని విమర్శించారు. తండ్రి వైఎస్సార్ ప్రారంభించిన గుండ్రేవుల ప్రాజెక్టును కుమారుడు జగన్ పెండింగ్లో పెట్టారని, ఇది పూర్తయి ఉంటే రెండు లక్షల ఎకరాలకు సాగునీరు, 6లక్షల మంది కర్నూలు ప్రజలకు తాగునీరు అందేదని అన్నారు.
కర్నూలులో న్యాయ రాజధాని (Judiciary Captial ) కడుతామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని దుయ్యబట్టారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో మోసం చేసిందని ఆరోపించారు.