తిరుపతి : దేశవాళీ గోజాతుల సంరక్షణ, అభివృద్ధి కోసం శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంతో కలసి టీటీడీ చేపట్టిన ప్రాజెక్టు సత్ఫలితాలనిస్తోందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి (KS Jawahar Reddy) అన్నారు. ఎస్వీ గో సంరక్షణశాలను సందర్శించిన సందర్భంగా పిండమార్పిడి ద్వారా ఇటీవల జన్మించిన ఆరు సాహివాల్ దూడలను, వసతి కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
దేశీయ గోజాతుల సంరక్షణ, అభివృద్ధి కోసం రెండు సంవత్సరాల క్రితం పశు వైద్య విశ్వవిద్యాలయంతో టీటీడీ (TTD) ఒప్పందం చేసుకుందన్నారు. ఇందులో భాగంగా ఉత్తర భారతదేశం నుంచి సాహివాల్ , కాంక్రీజ్, ఘిర్ లాంటి మేలు జాతి గోవులను తీసుకుని వచ్చి ప్రత్యేక సాంకేతికతో పిండమార్పిడి ( Transplantation) చేసి దేశీయ గోజాతుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో 90 శాతం ఆడ దూడలే జన్మిస్తాయని చెప్పారు. ప్రస్తుతం జన్మించిన ఆరు దూడల్లో ఒకటి మాత్రమే మగ దూడ జన్మించిందన్నారు.
సరోగసీ విధానం ( Surrogacy Policy) ద్వారా గర్భం దాల్చిన మరో 13 ఆవులు త్వరలో దూడలకు జన్మనివ్వబోతున్నాయన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి దేశీయ పాలతో కైంకర్యాలు, ప్రసాదాలు తయారు చేయడానికి కూడా చేపట్టిన ఈ ప్రయోగం స్వామి వారి ఆశీస్సులతో సత్ఫలితాలనిస్తోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు ఆయన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.