అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి నారాయణ స్వామి ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ రహదారి విస్తరణకు ప్రభుత్వ సహకారం సరిగా లేదని ఆరోపించారు. ఇవాళ విజయ వాడ పశ్చిమ బైపాస్ పనులను కేంద్ర మంత్రి పరిశీలించారు. రాజధానులు మూడు, నాలుగు పెట్టుకుంటారో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని, అయితే అభివృద్ధికి విఘాతం కలిగించకూడదని సూచించారు.
అమరావతి అభివృద్ధి చెందాలని కేంద్రం కోరుకుంటుందని వెల్లడించారు. అమరావతి రాజధాని కాబట్టే కేంద్రం ఎయిమ్స్ను కేటాయించిందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అభివృద్ధి పనులు ఆగకూడదని ఆయన అన్నారు.
దివ్యాంగుల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు. ఒంగోలులో నిన్న దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు, మాన్యువల్ ట్రై సైకిళ్లు, చక్రాల కుర్చీలు, ఇతర సహాయాలను పంపిణీ చేసిన ఆయన మాట్లాడుతూ వివిధ రకాల సహాయాలు అవసరమైన వారిని గుర్తించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత చొరవ చూపాలని అన్నారు.