Srisailam | శ్రీశైల క్షేత్రానికి వచ్చే యాత్రికుల అవసరాల కోసం చేపట్టిన అభివృద్ది పనులు భావితరాల భక్తుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి అధికారులకు సూచనలిచ్చారు. దేవస్థానం ఈవో పెద్దిరాజు, ఇంజనీరింగ్ అధికాలతో కలిసి బుధవారం ప్రధానమైన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు శాశ్వత పరిష్కార ప్రణాళికలు రూపొందించి వాటిని అమలుపరిచేందుకు తీసుకోవలసిన తక్షణ చర్యలను పరిశీలించారు.
రామయ్య టర్నింగ్ నుండి మల్లికార్జున సదన్ వరకు, రాజుల సత్రం నుండి విష్ణువల్లభ కాటేజ్ రోడ్డు వరకు వంతెనల ఏర్పాటుపై పనుల ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో రెడ్డివారి చక్రపాణి రెడ్డి చర్చించారు. అలాగే సిద్దరామప్ప కాంప్లెక్స్ పనులు, రోడ్లు భవనాల శాఖ భవనం వద్ద చేపట్టాల్సిన రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. దేవస్థానం అభివృద్దితోపాటు భక్తులకు కల్పించవలసిన వసతులపై చేపట్టే పనులను చిత్తశుద్దితో చేయాలని సిబ్బందిని హెచ్చరించారు.