తిరుమల : తిరుమల( Tirumala) శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబరు(December) నెల కోటాను బుధవారం(18)న ఉదయం 10 గంటలకు టీటీడీ(TTD) ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబరు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని అధికారులు వివరించారు. ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబరు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయని వెల్లడించారు.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను సెప్టెంబరు 21న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు. అదే రోజు వర్చువల్ సేవల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించినకోటాను విడుదల చేయనున్నామని చెప్పారు.
23న అంగప్రదక్షిణం టోకెన్లు
డిసెంబరు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను సెప్టెంబరు 23న ఉదయం 10 గంటలకు,
శ్రీవాణి ట్రస్టు టికెట్లు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని పేర్కొన్నారు.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా..
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుందని వెల్లడించారు.
24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
డిసెంబరు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సెప్టెంబరు 24న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల అవుతాయని వివరించారు.
27న శ్రీవారి సేవ కోటా విడుదల
సెప్టెంబరు 27న తిరుమల – తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నామని, భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు.