అమరావతి : ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం ( Vetla palem ) గ్రామంలో బాణా సంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ( Fireworks Explosions) పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సామర్లకోటకు చెందిన దర్శిపాటి లోవరాజు, దర్శిపాటి రాజేశ్ రాత్రి మృతి చెందారు. దీంతో ఘటనలో మరణించిన వారి సంఖ్య 23కు పెరిగింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
బాణాసంచా కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సంభవించిన భారీ పేలుడులో 21 మంది చనిపోగా మరో 15 మందికి తీవ్రంగా గాయపడ్డారు. వేట్లపాలెం, జి.మేడపాడు గ్రామాల మధ్య ఉన్న బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు పదార్ధాలు పెద్ద మొత్తంలో ఉండడంతో ప్రాణనష్టం జరిగింది.
పేలుడు తీవ్రతకు సమీపంలోని పంటపొలాల్లోకి మృతదేహాలు ఎగిరిపడ్డాయి. కాగా ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం మరోసారి స్పందించారు. పేలుడు ఘటనలు పునరావృతం కాకుండా తమిళనాడులోని శివకాశీ వెళ్లి స్టడీ చేయాలని అధికారులను ఆదేశించారు.