కాకినాడ: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Anantha babu) కారులో మృతదేహం కలకలం రేపుతున్నది. ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు కారులో యువకుడి మృతదేహం బయటపడింది. అతడిని ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్గా పనిచేసిన సుబ్రమణ్యంగా గుర్తించారు. గురువారం రాత్రి ఉదయ్ భాస్కర్ తనతోపాటు సుబ్రమణ్యంను బయటకు తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది. అయితే అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడు మృతిచెందాడని డ్రైవర్ తమ్ముడికి సమాచారం ఇచ్చారు.
శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు తన మృతదేహాన్ని ఎమ్మెల్సీ తన కారులో తీసుకొచ్చి అతని తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో అనంతబాబు కారును అక్కడే వదిలి వెళ్లిపోయారు. కాగా, సుబ్రమణ్యంను హత్య చేశారని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.