విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వ మత్స్య శాఖ.. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ)తో జతకట్టింది. భారతదేశం అంతటా డ్రెడ్జింగ్, ఇతర సముద్ర కార్యకలాపాల ద్వారా ఫిషింగ్ హార్బర్లు, రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరులను అభివృద్ధి చేయడానికి మత్స్య శాఖ, మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖతో ఒప్పందం కుదిరింది. ఈ మేరకు న్యూఢిల్లీలో మత్స్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి జతీంద్ర నాథ్ స్వైన్, జాయింట్ సెక్రటరీ జే బాలాజీ సమక్షంలో డీసీఐ ఎండీ, సీఈవోలు ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ డాక్టర్ విక్టర్ మాట్లాడుతూ, ఫిషింగ్ హార్బర్ను అభివృద్ధి చేయడంతోపాటు నిర్వహణ కోసం రాష్ట్రాలు, కేంద్రంతో దీర్ఘకాలిక ఒప్పందాలను కుదుర్చుకునేందుకు డీసీఐఎల్కు ఈ ఒప్పందం భారీ అవకాశం కల్పిస్తుందన్నారు. అలాగే, 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.1,000 కోట్ల టర్నోవర్ను చేరుకోవడంలో ఇది డీసీఐకి కొత్త వ్యాపార మార్గాలను తెరుస్తుందని చెప్పారు. డీసీఐఎల్-గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఫిషరీస్ డైరెక్టరేట్ మధ్య ఇప్పటికే ఒక అవగాహన ఒప్పందం కుదిరిందని, దీనికి సంబంధించిన పనులు మాంగ్రోల్ ఫిషింగ్ హార్బర్ రాక్ డ్రెడ్జింగ్లో ప్రారంభమయ్యాయని తెలిపారు. దీని ద్వారా భవిష్యత్ అన్ని రాక్ డ్రెడ్జింగ్ ప్రాజెక్ట్లకు అర్హత పొందేందుకు డీసీఐఎల్కు వీలు కలుగుతుందన్నారు.
విశాఖపట్నం కేంద్రంగా ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీసీఐఎల్).. మన దేశంలోని ప్రధాన డ్రెడ్జింగ్ సంస్థల్లో ఒకటిగా ఉన్నది. ఎగ్జిమ్ కోసం సురక్షితమైన నావిగేషనల్ ఛానెల్ని లోతుగా చేపట్టడం ద్వారా ప్రధాన నౌకాశ్రయాలు, మైనర్ పోర్టులు, ఇండియన్ నేవీ, ఫిషింగ్ హార్బర్లు, ఇతర సముద్ర సంస్థలకు డ్రెడ్జింగ్, అనుబంధ సేవలను అందిస్తున్నది. ప్రస్తుతం మత్స్యశాఖతో ఒప్పందంతో దేశంలోని ఫిషింగ్ హార్బర్లు, రిజర్వాయర్లు, చెరువులు అభివృద్ధికి నోచుకుంటాయన్న ఆశాభావాన్ని వెలిబుచ్చుతున్నారు.