Dasara Celebrations in Srisailam | శ్రీశైలంలో దసరా ఉత్సవాలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన బుధవారం చంద్రఘంటాదేవిగా భ్రమరాంబాదేవి భక్తులకు దర్శనమిచ్చింది. ఆదిపరాశక్తుల్లో తృతీయరూపిణి అయిన చంద్రఘంటాదేవి యుద్ధోన్ముఖురాలై సింహవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వగా చంద్రఘంటా సమేతుడైన శ్రీశైలేశుడు రావణ భుజస్కంధాలపై విహరిస్తూ భక్త జనాన్ని అలరింపజేశాడని ఈవో లవన్న తెలిపారు.
ఉదయం అమ్మవారికి ప్రాతఃకాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవవరణాచర్చనలు, శ్రీకాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవవరణార్చనలు, జపానుష్టాపారాయణాలు, చతుర్వేద పారాయణాలు,చండీ, దుర్గ, కాళి, లలితార్చనలు, కుమారి పూజలు చేశారు. అదేవిధంగా స్వామివారికి రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్రపారాయణాలు చేశారు. మధ్యాహ్నకాలార్చన, సహస్రనామార్చన, మహానివేదన అనంతరం సాయంకాలం జపానుష్టానాలు, శ్రీశైల ఖండ మహాపురాణ పారాయణం నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు భద్రయ్య, మార్కండేయ శర్మ తెలిపారు.
సాయంత్రం భ్రామరీ అమ్మవారిని పరాశక్తి రూపాల్లో మూడవ ఆవతారమైన చంద్రఘంటాదేవి రూపంలో అలంకరించి అమ్మవారి సింహ మండపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై అర్చక వేదపండితులు పూజలు నిర్వహించారు. ఈ దేవి పది చేతులతో కుడి వైపు పద్మం, బాణం, ధనస్సు, అభయహస్తం, జపమాలను మరియు ఎడమ వైపు త్రిశూలం, గద, ఖఢ్గం, పంచముద్ర, కమండలాన్ని ధరించి భక్తాదులకు దర్శనమిస్తుంది. ప్రశాంత వదనంతో శాంతరూపిణిగా ఉన్నప్పటికి యుధ్దోన్ముఖురాలై ఉంటుంది. ఈ అమ్మవారు తలపై అర్ధ చంద్రుడిని ఘంటాకారంలో ధరించడం వల్ల ఈ అమ్మవారిని చంద్రఘంటాదేవిగా పిలుస్తారు. అమ్మవారిని పూజించడం వల్ల భక్తుల కష్టాలు తీరుతాయని, ఈ దేవి ఆరాధన వలన సౌమ్యం, వినమ్రత కలుగుతాయని పురాణాల్లో చెప్పబడింది.
అక్కమహాదేవి అలంకార మండపంలో ఏర్పాటుచేసిన రావణవాహనసేవపై ఆసీనులైన స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చంద్రఘంటా దేవి సమేతుడైన శ్రీశైలేశుడు రావణ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించాడు. గ్రామోత్సవంలో భాగంగా స్వామిఅమ్మవార్లు ఉత్సవ మూర్తులు గంగాధర మండపం నుండి మొదులుకొని నంది మండపం వరకు, నంది మండపం నుంచి బయలు వీరభధ్రస్వామి వరకు విహరిస్తూ భక్తాదులను కరుణించారు. గ్రామోత్సవంలో నాదస్వరం, మహిళా వీరగాని కన్నడ జానపద కళాప్రదర్శన, రాజభటుల వేషాలు, కేరళ వారి కథకళి వేషాలు, తప్పెట చిందు, లంబాడి నృత్యం, కాళికా నృత్యం, చెక్కభజన, కోలాటం, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి, త్రిశూలం, జేగంట, కురవడోలు, కొమ్ము, నందికోలు సేవ మొదలగు వివిధ రకాల విన్యాసాలతో ఆధ్యాంతం కనులపండువగా సాగింది .ఉత్సవం తరువాత సువాసిని పూజ, కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు తీర్థప్రసాద వితరణ ఆదిదంపతులకు ఆస్థానసేవ జరిపించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మెన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు, పీఆర్వో శ్రీనివాసరావు, ఏఈవోలు డి.మల్లయ్య, హరిదాసు, మోహన్, సెక్యూరిటీ అధికారి నర్సింహారెడ్డి, , రవికుమార్, విజయసారథి, స్వాములు ఉన్నారు. అదే విధంగా ఆలయ దక్షిణ మాడవీధిలో కళారాధన సాంస్కతిక కార్యక్రమాలు కూడా భక్తులను ఆకట్టుకున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.
శరన్నవరాత్రుల్లో నాల్గో రోజు భ్రమరాంబాదేవి అమ్మవారు కూష్మాండదుర్గ అలంకారంలో దర్శనమివ్వగా మల్లికార్జున స్వామివారికి కైలాస వాహన సేవలో భక్తులను కరుణిస్తారని ఈవో లవన్న తెలిపారు. కూష్మాండ దుర్గను ఉపాసంచడం వల్ల రోగాలు, శోకాలు తొలగిపోయి ఆరోగ్యం చేకూరి ఆయువు యశస్సు వృద్ధి చెందుతుందని భక్తుల విశ్వాసం.