తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కొత్త సంవత్సరం సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 15 కంపార్ట్మెంట్లలో శ్రీవారి దర్శనానికి భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 78,460 మంది భక్తులు దర్శించుకోగా 29,182 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.03 కోట్లు వచ్చిందని తెలిపారు.
రేపటి నుంచి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ స్థానిక ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాసమంగాపురం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, నాగలాపురం శ్రీ వేద నారాయణస్వామివారి ఆలయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
అదేవిధంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామాలయం, చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయం, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, పిఠాపురంలోని శ్రీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయం వైకుంఠ ఏకాదశిని వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయం, బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, అమరావతిలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.