అమరావతి : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల (Tirumala) గిరులు కిటకిటలాడుతున్నాయి. కంపార్టుమెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయి , మూడు కిలోమీటర్ల వరకు భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరి ఉన్నారు. వీరికి 20 గంటల్లో దర్శనం అవుతుందని టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు.
క్యూలైన్లో నిలబడ్డ భక్తులు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అల్పహారం, పాలు, తాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. పెరుగుతున్న భక్తుల రద్దీ కారణంగా జూన్ 30వ తేదీ వరకు ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్(VIP Break Darsan) దర్శనం రద్దు చేసినట్లు వెల్లడించారు. కాగా నిన్న స్వామివారిని 65,416 మంది భక్తులు దర్శించుకోగా 36,128 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.51 కోట్లు వచ్చిందన్నారు.