తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు 12 కంపార్ట్మెంట్లలలో శ్రీవారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని వివరించారు.
నిన్న స్వామివారిని 78,158 మంది భక్తులు దర్శించుకోగా 27,090 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.73 కోట్లు వచ్చిందని వివరించారు.
భక్తిపారవశ్యంతో సాగిన పురందరదాస ఆరాధనోత్సవం
శ్రీవారి పరమభక్తుడు, కర్ణాటక సంగీత పితామహుడు శ్రీపురందరదాసుల ఆరాధన మహోత్సవం తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో భక్తిపారవశ్యంతో సాగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చిన వందలాది మంది దాస సాహిత్య ప్రాజెక్టు భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.
కర్ణాటకలోని ముళబాగళ్ శ్రీపాదరాజ మఠాధిపతి సుజయనిధి తీర్థ స్వామి కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలో సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. విశేషంగా అలంకరించిన మండపంలో ఊంజల్ సేవ నిర్వహించారు. సంకీర్తనలకు భజన బృందం సభ్యుల నృత్యం అలరించింది.