తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవమైన ఏడుకొండలస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఏటీజీహెచ్ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 36 గంటల్లో సర్వదర్శనం లభిస్తుందని టీటీడీ అధికారులు తెలిపారు.
నిన్న 58,379 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 28,950 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.73 కోట్లు వచ్చిందని అధికారులు వివరించారు. కాగా రేపు రథసప్తమి సందర్భంగా తిరుపతిలోని కౌంటర్లలో సర్వ దర్శనం టైంస్లాట్ టోకెన్లు రద్దు చేశారు.
భక్తులు ఆ రోజున వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలని తెలిపారు. వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవలు, వృద్ధులు ,దివ్యాంగులు తదితర ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు వెల్లడించారు.