తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వారాంతపు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు గోకులం గెస్ట్హౌస్ వరకు క్యూలైన్లో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 30గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
నిన్న 72,226 మంది భక్తులు దర్శించుకోగా 30,877 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.74 కోట్లు వచ్చిందని తెలిపారు. మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం రామకృష్ణ తీర్థ ముక్కోటిని దర్శించుకునేందుకు భక్తులకు పలు ఏర్పాట్లు చేశారు.
పాప నాశనం పరిసరాలలో తగినంత పార్కింగ్ స్థలం లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలు ,టాక్సీలను గోగర్భం డాం వద్ద నుంచి అనుమతించలేదని అధికారులు తెలిపారు. భక్తుల భద్రతను పర్యవేక్షించేందుకు చలువ బండ పాయింట్ నుంచి రామకృష్ణ తీర్థం వరకు ప్రతి 15 మీటర్లకు విజిలెన్స్, పోలీస్, ఫారెస్ట్ నుంచి ఒకరిని నియమించారు.