తిరుమల : తిరుమల(tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 20 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు(ttd officials) తెలిపారు. నిన్న స్వామివారిని 79,561 మంది భక్తులు(devotees )దర్శించుకోగా 36,784 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం( hundi income) రూ. 3.82 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
18న శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగం
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 18న శాస్త్రోక్తంగా పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం మార్చి 17న సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారని వెల్లడించారు. ఆలయంలో ఫిబ్రవరి 11 నుంచి 19వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకులు, అధికార అనధికారులు, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారని వివరించారు.
మార్చి 18న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారని చెప్పారు. శ్రీవారి పుష్పయాగాన్ని పురస్కరించుకుని మార్చి 18న నిత్య కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.