తిరుమల : తిరుమలలో రికార్డు స్థాయిలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వారాంతపు సెలవు దినాలతో పాటు తొలి ఏకదాశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల కొండకు తరలివచ్చారు. నిన్న 87,478 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 48,692 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.53 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు. కొండపై ఉన్న కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి.
ఆస్థాన మండపం వరకు భక్తులు దర్శనం కోసం క్యూలో వేచి ఉన్నారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టారు. 11న గ్రంథి పవిత్ర సమర్పణ, 12న మహాపూర్ణాహుతి నిర్వహిస్తామని వెల్లడించారు.
చివరిరోజు సాయంత్రం 6 గంటలకు పంచమూర్తులైన కపిలేశ్వరస్వామి, కామాక్షి అమ్మవారు, విఘ్నేశ్వరస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరస్వామివార్లకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తామన్నారు.