తిరుమల : భారీ వర్షాల కారణంగా తిరుమల ( Tirumala ) కు భక్తుల రద్దీ తగ్గింది . గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న రాష్ట్రాల్లోను వర్షాలు పడుతుండడంతో భక్తులు తిరుమల రాకను విరమించుకుంటుండడంతో రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 6 కంపార్ట్మెంట్లలో దర్శనానికి వేచి యున్నారు.
నిన్న స్వామివారిని 74, 268 మంది దర్శించుకోగా 26,817 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ. 4.32 కోట్లు వచ్చిందని అధికారులు వివరించారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan ) కలుగుతుందని వెల్లడించారు.
రేపటి నుంచి వారణాళిలో చతుర్వేద హవనం
వారణాశి లోని శివాల ప్రాంతం సమీపంలోని చాట్ సింగ్ ఫోర్ట్ వద్ద జూలై 28 నుంచి ఆగస్ట్ 3వ తేదీ వరకు ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస చతుర్వేద హవనం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ పండితులు తెలిపారు.
లోకక్షేమం, ఆరోగ్యం, ఐశ్వర్య వృద్ధి కొరకు, అతివృష్టి, అనావృష్టి నుంచి ప్రపంచాన్ని కాపాడాలని ఈ కార్యక్రమం తలపెట్టినట్లు వివరించారు. ఇందులో భాగంగా హోమ గుండాలు ఏర్పాటు చేసి ఏడు రోజుల పాటు నాలుగు వేదాల్లోని అన్ని మంత్రాలను పఠించి యజ్ఞేశ్వరునికి సమర్పణ చేస్తామని చెప్పారు.