అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు నిరసన తెలిపారు. సీపీఎస్ రద్దు చేయాలని, జీపీఎస్ను అంగీకరించొద్దని కోరుతూ ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులకు గులాబీ పూలు అందజేసి నిరసన తెలిపారు. ఇవాళ ఏపీ సచివాలయంలోని బ్లా్క్ -2లో మంత్రివర్గ ఉపసంఘం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సచివాలయానికి పెద్ద ఎత్తున ఉద్యోగులు అక్కడికి చేరుకుని ముందస్తుగా ఉద్యోగ సంఘాల నాయకులకు ఓపీఎస్పైనే చర్చించాలని సూచించారు. సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని అంగీకరించొద్దని నేతలకు విజ్ఞప్తి చేశారు. సీపీఎస్, జీపీఎస్ వద్దు, ఓల్ట్ పెన్షన్ స్కీం ముద్దంటూ ప్లకార్డులు, గులాబీపూలతో నినాదాలు చేశారు. ఉద్యోగులు మాట్లాడుతూ గతంలో పీఆర్సీ సాధన సమితి సమావేశంలో జరిగిన చర్చల్లో ఓపీఎస్ను తీసుకువస్తామని ఉద్యోగ సంఘం నాయకులు చెప్పారని పేర్కొన్నారు.
సమావేశంలో ఓపీఎస్ కాకుండా జీపీఎస్ గురించి మాట్లాడితే సమావేశాన్ని బైకాట్ చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులను కోరేందుకు సచివాలయానికి వచ్చామని పేర్కొన్నారు. కాగా ఉద్యోగ సంఘం నాయకుడు బొప్పరాజు మాట్లాడుతూ సీపీఎస్ను రద్దు చేయాలని మొదటి నుంచి ఉద్యోగ సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం మాత్రం జీపీఎస్ను తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.