విజయవాడ: తమ పార్టీ ప్లీనరీ విజయవంతమైందని వైసీపీ నేతలు చంకలు గుద్దుకోవడాన్ని ఏపీ సీపీఎం శాఖ విమర్శించింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ప్లీనరీలో కనీసం ఒక్క ప్రజాసమస్యపై అయినా చర్చించకపోవడం.. వారికి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలుపుతుందని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడంలో వైసీపీ ప్లీనరీ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్తో కలిసి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల వైసీపీ ప్లీనరీలో ఆత్మపరిశీలన చేసుకోలేదని, ఆత్మస్తుతి చేసుకోవడానికే సమయం కేటాయించారని అన్నారు.
వైసీపీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న 95 శాతం హామీలను అమలు చేశామని చెప్తున్న జగన్ ప్రభుత్వం.. ప్రజలపై మోపిన భారాల గురించి ప్రస్తావించకపోవడం విడ్డూరంగా ఉన్నదని శ్రీనివాసరావు చెప్పారు. ప్రజా సమస్యలపై ప్లీనరీలో ముఖ్యమంత్రి స్పందించకపోవడంతో ప్రజలు నిరాశ చెందారని అన్నారు. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం లభించలేదని, సీపీఎస్, కాంట్రాక్టు ఉద్యోగులు, స్కీం వర్కర్ల క్రమబద్ధీకరణ, ఆరోగ్యశ్రీ, అమలుకాని పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలు, స్థానిక సంస్థల హక్కులు, నిధులు, భూపంపిణీ వంటి అనేక సమస్యలు అనేకం ఉన్నా వాటిని విస్మరించారని తెలిపారు. పైగా ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ టారిఫ్, పెట్రోల్, డీజిల్ ధరలు, ఆస్తిపన్ను పెంచి చెత్త పన్ను విధించి బాధిస్తున్నదని ఆరోపించారు.
ప్రజాసమస్యలు పరిష్కరించకుండా 2024 ఎన్నికలకు సిద్ధమై 175 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకోవడం ఏమిటని శ్రీనివాసరావు ప్రశ్నించారు. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోవడంతో యువత ఉపాధి కోసం ముంబై, బెంగళూరు, పుణె, చెన్నై వంటి ప్రాంతాలకు వలస వెళ్లడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనాలు అందకుండా చేస్తున్నారని, అన్యాయంపై నిరసన తెలిపే హక్కు కూడా కార్మికులకు లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. గత 40 రోజులుగా 400 మండలాలు, 70 పట్టణాలు, 1,200 వార్డులు, 3,500 గ్రామాల్లో ఐదు లక్షల కుటుంబాలను కలుస్తూ సర్వేలు నిర్వహించినట్లు శ్రీనివాసరావు తెలిపారు. సర్వేలో గుర్తించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేస్తున్నట్లు తెలిపారు.