రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టడం కోసమే బీజేపీ పాదయాత్ర డ్రామాలు ఆడుతున్నదని సీపీఐ రామకృష్ణ విమర్శించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం.. రెండూ కలిసి రెండు లక్షల మంది పోలవరం నిర్వాసితుల్ని ముంచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి పనులు చేయించలేని వైసీపీ ఎంపీలు దద్దమ్మల్లా ఢిల్లీలో తిరిగే బదులుగా వారు రాజీనామా చేయడం ఉత్తమమన్నారు. మంగళవారం ఆయన రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తామని బీజేపీ పగటి కలలు కంటున్నదని, వారి కలలు కల్లలవుతాయని వారికి కూడా తెలుసునని రామకృష్ణ వ్యాఖ్యానించారు. పాదయాత్ర చేస్తే అధికారంలోకి వస్తామని వైఎస్ఆర్ను ఫాలో అవడం వారి మూర్ఖత్వమే అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరుగడం లేదని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీకి జగన్ పార్టీ దాసోహం అవడం వల్లనే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం ఎందుకు దిగిరాదో చూడాలని ఆయన జగన్ పార్టీకి సూచించారు. బీజేపీ, వైసీపీ లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. సీఎం జగన్ వైఖరితో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నదని విచారం వ్యక్తం చేశారు.