హైదరాబాద్: ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు, సినీ తారలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా సీపీఐ నాయకులు నారాయణ మొక్కలు నాటారు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని స్వగ్రామమైన చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని ఆయనంబాకంలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామస్తులు ప్రతి ఒక్కరు ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
ఇంత అద్భుతమైన కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ను అభినందించారు. కాగా, పుట్టిన రోజు, పెండ్లి రోజు లాంటి వేడుకలకు దూరంగా ఉండే కమ్యూనిస్టు నాయకులను సైతం గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఆకర్షిస్తుండటం విశేషం.
తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నందుకుగాను సీపీఐ నారాయణకు ఎంపీ సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమంలో గ్రామస్తులు పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు.