విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 నుంచి 14 ఏండ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభమైంది. వ్యాక్సిన్ పంపిణీపై జిల్లా వైద్యాధికారులకు ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో 14.90 లక్షల మంది పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయనున్నట్లు అధికారులు తెలిపారు. బయోలాజికల్ ఈ లిమిటెడ్ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్ వ్యాక్సిన్ను
ప్రభుత్వం పిల్లలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నది. మొదటి మోతాదు తర్వాత 28 రోజులకు రెండో డోస్ ఇవ్వనున్నారు. టీకా కోసం కొవిన్ యాప్లో రిజిస్ట్రేషన్ మంగళవారం నుంచి ప్రారంభమైంది.
రాష్ట్రంలో 15–18 ఏండ్ల వయసున్న వారికి రెండు డోస్ల వ్యాక్సిన్ పంపిణీ ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేశారు. గత జనవరిలో టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. 24.41 లక్షల మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోని 24.33 లక్షల మందికి రెండు డోసులు వేసింది. 25.21 లక్షల మందికి మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. 2008 మార్చి 15 నుంచి 2010 మార్చి 15 మధ్య జన్మించిన పిల్లలందరూ ఇప్పుడు టీకాలు తీసుకోవడానికి అర్హులని ఏపీ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ హైమావతి తెలిపారు. ప్రభుత్వ దవాఖానాల్లోని టీకా కేంద్రాల్లో పేర్లను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 15.21 లక్షల డోసుల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
ఇలాఉండగా, ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో తాజాగా 59 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 23,18,943 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,730 మంది మరణించారు. కాగా, కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 23,03,690 గా ఉన్నది.