తిరుమల : తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను నూతన పరకామణి భవనంలో ఆదివారం నుంచి లెక్కించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి నూతన భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బెంగుళూరుకు చెందిన దాత మురళీకృష్ణ సహకారంతో నూతన పరకామణి భవనాన్ని అత్యాధునిక భద్రతతో ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ భవనంలో సీసీ కెమెరాలు, ఇతర మౌలిక వసతులు కల్పన పూర్తి కావడంతో కానుకల లెక్కింపును ప్రారంభించినట్లు వివరించారు.
తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి వారి ఆశీస్సులతో శ్రీవారి ఆలయం నుంచి 12 హుండీలు చిన్న లిఫ్ట్ సహాయంతో లారీలో నూతన భవనంలోకి తరలించినట్లు చెప్పారు. ఇకపై ప్రతిరోజు అన్ని హుండీలు నూతన పరకామణి భవనానికి చేరుకుంటాయన్నారు.
నెల రోజుల తరువాత ఆలయంలోని పరకామణి మండపాన్ని భక్తులు కూర్చునేందుకు అనువుగా తీర్చిదిద్దనున్నట్లు ఈవో వివరించారు.అంతకుముందు నూతన పరకామణి భవనంలో వాస్తు హోమం, గోపూజ, శ్రీవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈవో పరకామణి లెక్కింపును పరిశీలించి, పలు సూచనలు చేశారు.