అమరావతి : ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఉప ఎన్నికల కౌంటింగ్కు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 24న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. మొత్తం 178 పోలింగ్ బూత్ ల పరిధిలో 2,13, 644 మంది ఓటర్లు ఉండగా 1,37,038 (64.17 శాతం ) మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో పోలింగ్ జరగగా చేజర్ల మండలంలో అత్యధికంగా 67.9 శాతం , అత్యల్పంగా మర్రిపాడులో 59.8 శాతం నమోదైంది. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 82.49 శాతం ఓట్లు పోలవగా ఈ ఎన్నికల్లో 64.17 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్కు ఎన్నికల అధికారులకు, సిబ్బందికి ఒకరోజు ముందుగానే శిక్షణ ఇచ్చి ఎన్నికల నిబంధనలను వివరించారు. ఉదయం 7 గంటలలోగా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
రేపు ఉదయం 11 గంటల వరకు పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారుఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరుకు ఉప ఎన్నికను నిర్వహించగా 14 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వీరిలో ప్రధానంగా అధికార వైసీపీ , బీజేపీ అభ్యర్థుల మధ్య గెలుపు, ఓటములు ఉంటాయని భావిస్తున్నారు.